శాంతి కమిటీ సభ్యులు యువతకు మార్గదర్శకంగా నిలవాలి
రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల సూచనలు – ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు : జిల్లా ఎస్పి డి. జానకి
మహబూబ్నగర్, నవోదయం: రాబోయే వివిధ మతాల పండుగలను మత సామరస్యం, సోదరభావం, ఐక్యతతో ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ సూచించారు. యువతను సన్మార్గంలో నడిపించడంలో శాంతి కమిటీ సభ్యులు, మతపెద్దలు, సమాజ పెద్దలు కీలక పాత్ర పోషించాలని కోరారు.
మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కవాతు మైదానం హాల్లో శుక్రవారం జిల్లా ఎస్పీ డి. జానకి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే పండుగల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలు, మత సామరస్యం, ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలను శాంతియుతంగా జరుపుకుంటున్నారని తెలిపారు. గతంలో పోలీసు శాఖకు ప్రజలు అందించిన సహకారం అభినందనీయమని, అదే స్ఫూర్తితో రాబోయే పండుగలను కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
యువతలో సామాజిక బాధ్యత, మత సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేలా పెద్దలు అవగాహన కల్పించాలని సూచించారు. యువత వివాదాలకు, గొడవలకు, ఇతరులను రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండేలా వారికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత సమాజ పెద్దలపై ఉందన్నారు.
డీజే వినియోగంలో నిబంధనలు పాటించాలి
పండుగల సందర్భంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్లను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించవద్దని ఎస్పీ సూచించారు. అధిక శబ్దం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రశాంత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సౌండ్ సిస్టమ్లను నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని కోరారు.
ఫేక్ న్యూస్ వైరల్ చేస్తే చర్యలు
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఎస్పీ డి. జానకి స్పష్టం చేశారు. ఒక మతం లేదా వర్గానికి వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని ప్రచారం చేయడం, రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, ఫేక్ న్యూస్ను వైరల్ చేయడం, నిర్ధారణ లేని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిజమని నమ్మకుండా వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని తెలిపారు. ముఖ్యంగా పండుగల సమయంలో మత విద్వేషాలు, అపోహలు, ఉద్రిక్తతలకు దారితీసే సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దన్నారు. ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులు లేదా వివాదాలకు దారితీసే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎలాంటి వదంతులు, అనుమానాస్పద సమాచారం లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు దృష్టికి వచ్చినా వాటిని నమ్మకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ పరస్పరం గౌరవించుకోవాలని, పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న వివిధ మతాల మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలోని మత సామరస్యం, సోదరభావాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని, యువతకు సానుకూల దిశానిర్దేశం చేస్తామని పేర్కొన్నారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని, పండుగల సందర్భంగా అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. మత సామరస్యం, సోదరభావం, ఐక్యత, శాంతియుత వాతావరణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ పండుగలను ఆనందంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, వన్టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూటౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఆర్ఐ కృష్ణయ్య, వీఎచ్పీ అధ్యక్షుడు యాది రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు హాదీ, జడ్చర్ల పట్టణ హిందూ, ముస్లిం మతపెద్దలు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు రాములు యాదవ్, కార్పొరేటర్లు, శాంతి కమిటీ సభ్యులు, వివిధ మతాల మతపెద్దలు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Telangana
రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల సూచనలు – ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు : జిల్లా ఎస్పి డి. జానకి
Quick Summary:
రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల సూచనలు – ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు : జిల్లా ఎస్పి డి. జానకి
