గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించి, అనంతరం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. అర్హులైన గీత, చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నా వారికి సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
గౌడ సోదరులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు గీత కార్మికులు మృతి చెందితే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు. గీత కార్మికుల వృత్తిని రక్షించేందుకు నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత, తాటి చెట్లను విరివిగా నాటాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.
పండుగ సాయన్న జయంతి అధికారికంగా నిర్వహిస్తాం
దొరలు, భూస్వాములు, పెత్తందార్లపై పోరాటం చేసిన యోధుడు పండుగ సాయన్న అని సీఎం పేర్కొన్నారు. ముదిరాజ్ల ఆరాధ్యదైవంగా ఆయన పోరాట స్ఫూర్తి, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసని అన్నారు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు.
బహుజనుల వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులానికి, కుటుంబానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని, బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బహుజనులతో కలిసి పోరాడి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన పాపన్న స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
గీత కార్మికులు, గౌడ సోదరులు చాలాకాలంగా సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారని సీఎం తెలిపారు. నెక్లెస్ రోడ్ చౌరస్తాను స్వయంగా పరిశీలించి, జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహానికి స్థలాన్ని ఎంపిక చేశామని చెప్పారు. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ట్యాంక్బండ్పై పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరోచోటికి తరలించి, ఆ స్థలంలో పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్బండ్ మీదుగా వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ విగ్రహం స్ఫూర్తిదాయకంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సీఎం తెలిపారు.
పిల్లలను చదివించాలి
కులవృత్తులను కొనసాగిస్తూ వాటిని గౌరవించాలని, అయితే పిల్లలకు మాత్రం ఉన్నత విద్య అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పిల్లల తలరాతలను మార్చే శక్తి విద్యతోనే సాధ్యమని అన్నారు. పిల్లలను ఉన్నతంగా చదివించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని సూచించారు.
విద్యార్థుల కోసం అవసరమైనన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని చెప్పారు.
“మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వారిని చదివించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది” అని సీఎం అన్నారు. ఏటీసీల్లో చేరే వారికి నెలకు రూ.2 వేల ఉపకార వేతనం అందిస్తున్నామని తెలిపారు.
సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం
తమ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన నిర్వహించడంతో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టామని తెలిపారు. సామాజిక న్యాయాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
Telangana
గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
Quick Summary:
గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
